ప్రతిపక్షం, జూలై 04: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలైందని ఆరోపించిన ఆయన, అదే సమయంలో కేసీఆర్ రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంపద ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రభుత్వం ఎందుకు మారాలని, ఫామ్హౌస్కే పరిమితమైన నాయకత్వం మళ్లీ ఎందుకు రావాలని ప్రజలే చర్చించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

















