Trending Now

‘ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు’

కేంద్ర జల్‌శక్తి శాఖకు చేరిన అసెంబ్లీ తీర్మానం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కృష్ణా జలాలపై శాసనసభ తీర్మానాన్ని నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల వనరుల శాఖకు పంపింది. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ఇటీవల అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాసిన లేఖను కృష్ణా బోర్డు కేంద్రానికి నివేదించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్​పై పోలీసులను మోహరించిన విషయాన్ని ఉత్తమ్​కుమార్​ రెడ్డి గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని అంతా ఆశించామని, అయితే రోజుకు 3 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అక్రమంగా తరలించుకు వెళుతుందని ఆరోపించారు.

పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు గత బీఆర్​ఎస్​ సర్కార్ ఒప్పుకుందని వివరించారు. బీఆర్​ఎస్​ పాలకులది అవగాహన లోపమో, అసమర్థతో అర్థం కావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కు పొందేందుకు తెలంగాణకు పూర్తి అర్హత ఉందని చెప్పారు. కానీ 512:219 టీఎంసీల కేటాయింపును ఏపీ శాశ్వతం చేస్తోందన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అవినీతి, స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే కేసీఆర్​ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్​ పొగిడారని, తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్​ చెప్పారని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love