Trending Now

సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే.. సీఎం రేవంత్​

మరో రెండు పథకాలు ప్రజలకు అంకితం..

సచివాలయంలో ప్రారంభించిన సీఎం రేవంత్..

అయిదుగురు లబ్ధిదారులకు ఫ్రీ కరెంట్​, రూ.500 సిలీండర్​ అందజేత..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామన్నారు. తుక్కుగూడలో రాజీవ్​గాంధీ ప్రాంగణంలో జరిగిన సభలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన మేము, మరో రెండు గ్యారంటీలను అందజేస్తున్నామన్నారు.

రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో లాంఛనంగా ప్రియాంకగాంధీ ప్రారంభించాల్సి ఉండేదని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామన్నారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారన్నారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. హామీలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమన్నారు. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందున్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అందులో సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం ముందుకు నడుస్తున్నదని రేవంత్​రెడ్డి తెలిపారు. నిజమైన లబ్ధిదారుకే ప్రభుత్వ లబ్ధి పొందాలన్న లక్ష్యంతో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఉత్తమ్​కుమార్​రెడ్డి, శ్రీధర్​బాబు, సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్​ శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చేవేళ్ల బహిరంగ సభకు బయలు దేరిన సీఎం సచివాలయం నుంచి సీఎం రేవంత్​రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా చేవేళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.

Spread the love