21వ బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న 21వ బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగానికి రాజధానిగా ఉందని, అలాగే లైఫ్ సైన్సెస్ రాజధాని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీవ వైవిధ్య, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. అలాగే ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపైనా చర్చలు జరిపారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలపై ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో మూడు కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చాయని, అందులో ఒకటి అందించిన ఘనత హైదరాబాద్కే దక్కుతుందని వివరించారు.
20 ఏళ్లుగా బయో ఆసియా సదస్సులు హైదరాబాద్ను ఉన్నత శిఖరంలో నిలిపాయని అన్నారు. హైదరాబాద్ ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎంఎస్ఎంఈలను పటిష్ఠం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఫార్మా రంగాల్లో సవాళ్లను తాను అర్థం చేసుకోగలనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మధ్య కొందరు ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యానని, వారి సమస్యలు వివరించారన్నారు. ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు మా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఎంఎస్ఎంఈలను పటిష్ఠం చేసేందుకు మా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది.
నైపుణ్య రాజధానిగా హైదరాబాద్..
21 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రయాణం మొదలైందని, జీవ వైద్య రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు ఇది ఒక మంచి వేదికని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. త్వరలోనే న్యూలైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. జీవవైద్య రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని విస్తరించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ జీవవైద్య రంగం అభివృద్ధికికి ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు. నైపుణ్య రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు