Trending Now

‘దయచేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయండి’.. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత లేఖ..

ప్రతిపక్షం, హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని తెలిపారు. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడం వల్ల 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనకు భంగం కలుగుతుందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 16 ఉద్యోగాలు ఉంటేనే ఒక ఎస్సీ మహిళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని ఉదాహరించారు. మహిళలకు రావాల్సిన ఉద్యోగాలు పురుషులకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది రిజర్వేషన్ల స్పూర్తికి భంగం కలిగిస్తుందని, రిజర్వేషన్ల స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కే నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో దాదాపు 2 లక్షల 60 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే అందులో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు. ఉదాహరణకు ఒకటి నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్లు ఉంటే.. ఓసీలకు 3, ఎస్సీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఒకటి చొప్పున పోస్టులు ఉన్నాయనుకుంటే బీసీ-సీ, ఎస్సీ మహిళకు ఉద్యోగం రావాలంటే శాఖలో కనీసం 16 నుంచి 20 ఉద్యోగాలు ఉంటే తప్పా వాళ్లకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. కానీ ఓసీ ఆడబిడ్డకు మాత్రం కచ్చితంగా ఒక ఉద్యోగం వస్తుందని తెలిపారు.

2022లో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లలో ఆర్టీఏ ఉద్యోగాల భర్తీ చేపడితే గ్రూప్ 1 మల్టీజోన్ 1, గ్రూప్ 2 మల్టీజోన్ కింద 41 ఉద్యోగాలు ఉంటే.. మల్టీ జోన్ 1 కింద 19 ఉద్యోగాలు ఉన్నాయని.. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేస్తే మహిళలకు 6 ఉద్యోగాలు వస్తాయని, కానీ మారిన పరిస్థితుల్లో మూడు ఉద్యోగాలు మాత్రమే మహిళలకు వస్తాయని వివరించారు. మల్టీజోన్ 2లో 23 ఉద్యోగాలు ఉన్నాయని, రోస్టర్ పాయింట్లు తీసివేయడం వల్ల కేవలం 14 శాతం మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయని చెప్పారు. ప్రతీ శాఖపై ఈ ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను నిర్దేశించకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏది అనిపిస్తే అది చేస్తారని, తద్వారా మహిళల ఉద్యోగావకాశాలకు భద్రత ఉండబోదని స్పష్టం చేశారు.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించిందని రాష్ట్ర ప్రభుత్వం సాకుగా చూపిస్తోందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఘమేఘాల ఈ నెల 6న మీద హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుందని తెలిపారు. జీవో 3 ఈ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు వర్తిస్తుందా లేదా గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తిస్తుందా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పిస్తామంటుంటే 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు దాదాపు 66 వేల ఉద్యోగాలు రావాలని, కొత్త పద్ధతి ప్రకారం మహిళలకు 66 వేల ఉద్యోగాలు వస్తాయా రావా అన్న విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సూచించారు. “రిజర్వేషన్లలో మార్పులు చేసే ముందు మేధావులతో సంప్రదింపులు చేశారా లేదా ? పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి, మహిళా అభ్యర్థులు, మహిళా హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లలో మాట్లాడారా ? ” అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలపై పెట్టే దృష్టి రోస్టర్ పాయింట్లపై పెట్టి ఉంటే ఈ రోజు ఆడబిడ్డలకు అన్యాయం జరిగేది కాదని అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో3ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. జీవో 3ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో సోనియా గాంధీ చెప్పాలన్నారు. జీవోను వెనక్కి తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

Spread the love

Latest News