ప్రతిపక్షం, జూలై 08: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఏడాదిన్నర చిన్నారి మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మృతిచెందిన చిన్నారిని వంశికగా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం, చిన్నారి ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ఘటనపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
చిన్నారి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















