Trending Now

‘అందుకే నడుం విరగొట్టి శిక్షించాడు’.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

ప్రతిపక్షం, నల్గొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని.. ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల ఆశతో కేసీఆర్, అల్లుడు, కొడుకులు.. హైదరాబాద్‌లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని విమర్శించారు. అందుకే రిజల్ట్ వచ్చిన రోజే కేసీఆర్ నడుము విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారన్నారు. డిండి, ఎస్ఎల్ బీసీ పూర్తి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

రోజుకు నలుగురు పార్టీ మారుతుంటే బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మొదటి హామీనే అమలు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ మొదటి ఐదేళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టే వారి ఉసురు తగిలి కరువు వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. చచ్చిన పాము లాంటింది బీఆర్ఎస్ పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో ఈసారి ఒక్క సీటూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Spread the love