- తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
ప్రతి పక్షం, నల్లగొండ జూన్ 04: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు.

















