ప్రతిపక్షం, జూలై 18: మేడ్చల్ జిల్లాలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పీర్జాదిగూడ చెరువులో తేజస్విని (25) మృతదేహం లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. తేజస్విని తన తల్లిని ఇంట్లో ఉంచి బయట నుంచి తలుపులకు తాళం వేసిన అనంతరం బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె నగ్నంగా వీధుల్లో పరుగెత్తిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమీపంలోని ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
కొద్దిసేపటి తర్వాత తేజస్విని చెరువులో మృతదేహంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, గత ఆరు నెలలుగా తమకు రక్తం కనిపిస్తూ పీడకలలు వస్తున్నాయని తేజస్విని తల్లి చెప్పినట్లు సమాచారం. దీంతో యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి, ఆరోగ్య సమస్యలు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
















