Trending Now

షాద్ నగర్ బీజేపీలో సయోధ్య తూచ్…

ఎవరికి వారే యమున తీరు..

నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి?

ఇలా అయితే విజయతీరాలకు చేరేదెలా.?

ప్రతిపక్షం, షాద్ నగర్, మే 06: రాజకీయాలలో హత్యలు వుండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనే నానుడి వుంది. దేశంలో మోడీ చరిష్మాతో కేంద్రంలో మళ్ళీ అధికారం సాధించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వున్న అల్లుడి నోట్లో శని అన్నచందంగా షాద్ నగర్ బీజేపీ పరిస్థితి తయారైంది. నాయకుల వ్యవహార శైలి కారణంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి విభిన్నంగా మారింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బిజేపీ నాయకుల మధ్య సయోధ్య లేక ఎవరికి వారే యమునా తీరే అన్న చందం గా తమ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని విమర్శలున్నాయి. మొదట్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ దాదాపుగా బీజేపీ వైపు మల్లిందని నియోజకవర్గంలో పెద్ద చర్చే జరిగింది. కానీ కొంత కాలానికే బీజేపీ నాయకుల తీరు, వారి మధ్య అధిపత్య పోరు గమనించిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఎవరికి వారే యమున తీరు..

గతంలో బీజేపీలో ఉండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల్లే మళ్ళీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది కాస్త షాద్ నగర్ బీజేపీలో అగ్నికి ఆజ్యం పోసినట్లయినది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందె బాబయ్య, రాష్ట్ర నాయకులుగా పార్టీకి ఎంతోకాలంగా పనిచేస్తున్ననెల్లి శ్రీవర్ధన్ రెడ్డిలు ఎవరికి వారు విడివిడిగా ప్రచార కార్యక్రమాలు చేయటం ఎవరికి వారే యమున తీరు అనేవిధంగా ప్రవర్తిస్తుండటం పార్టీకి నష్టం వాటిల్లేలా తయారయ్యిందని బిజేపీ కింది స్థాయి కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

అంతే కాకుండా కొంతమంది బీజేపీ నేతలు కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. పేపర్ పులులు ఉన్నారనే గుస గుసలు కూడా నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. నాయకుల తీరుతో క్యాడర్ లో సైతం గ్రూపులు ఏర్పడ్డాయని, ఇలా అయితే నియోజకవర్గంలో మెజారిటీ ఎలా సాధ్యమని సగటు బీజేపీ కార్యకర్త
ఆవేదన చెందుతున్నాడు. విజయం సాధించే అవకాశం వున్న స్థానిక నాయకుల సమన్వయ లోపం పార్టీకి చేటుచేసేలా ఉందనేది జగమెరిగిన సత్యం. దీన్ని పార్టీ అధినాయకత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Spread the love

Related News