Trending Now

అక్కడ బీఆర్ఎస్ ఖాళీ.. కాంగ్రెస్​లో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు క్యూకడుతున్నారు. గత పదేళ్లు బీఆర్​ఎస్​లో ఉండి పలు పదవులు పొందిన నాయకులు ముచ్చటగా వంద రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు సాహసించడంలేదు. దీనికి తోడు మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో జిల్లాలో అధికార కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, మున్సిపల్​ కౌన్సిలర్లపై విసిరిన ఆకర్స్​ మంత్రం బాగా పనిచేస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని షాద్​నగర్​ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ ప్రతిపక్ష బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలపై ఆకర్ష్​ మంత్రం బాగా పనిచేస్తున్నది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​తో పాటు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్​రెడ్డి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు, గత వారం రోజుల నుంచి గ్రామాల్లో బీఆర్​ఎస్​కు చెందిన మాజీ సర్పంచ్​లు, ముఖ్యనేతలతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలకు కాంగ్రెస్​ కండువా కప్పుతూనే ఉన్నారు.

బుధవారం నాడు బీఆర్​ఎస్​ నేత, షాద్​నగర్​ మాజీ మున్సిపల్​ చైర్మెన్​ అగ్గనూరి విశ్వంతో పాటు చటాన్​పల్లి కౌన్సిలర్​ భర్త కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. షాద్​నగర్​ సర్పంచ్​గా రెండు పర్యాయాలు, చైర్మన్​గా ఒక పర్యాయం పని చేసిన అగ్గనూరు విశ్వం 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డితో పాటు బీఆర్​ఎస్​పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అగ్గనూరు విశ్వం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి అనుచరుడుగా పేరు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్​రెడ్డికి టికెట్​ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్​లో చేరడమే కాకుండా వీర్లపల్లి శంకర్​గెలుపుకు కంకణం కట్టుకొని పనిచేశారు. శంకర్​ గెలుపే లక్ష్యంగా ఆయన అంతా తానై ప్రచారం నిర్వహించడంతో పాటు బీఆర్​ఎస్​కు చెందిన ఇద్దరు జడ్పీటీసీలను సైతం తన వెంట కాంగ్రెస్​ కండువా కప్పించారు.

Spread the love