ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ త్వరలో సమావేశం కానున్నారు. మరో వారం, పది రోజుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉందని మహారాష్ట్ర నీటిపారుదల సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ఎత్తుపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మహారాష్ట్ర సీఎం ఫడణవీస్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంతో పాటు గోదావరి జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణకు సాగునీటి అవసరాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ భేటీ ద్వారా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.


















