ప్రతిపక్షం, జూన్ 08: తెలంగాణలో యూరియా పంపిణీకి సంబంధించిన యాప్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణలో అమలు చేస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యుద్ధాల ప్రభావంతో యూరియా సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందని వివరించారు.
అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూమి సారం దెబ్బతింటుందని, రైతులు సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతుల్లో అవగాహన పెంచేందుకు “రైతు నేస్తం” కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
యూరియా యాప్పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రి, రైతులు అలాంటి అపోహలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో పారదర్శకత, ఎరువుల సమర్థ పంపిణీ కోసం ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.

















