Trending Now

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత అవినీతిపై ఉద్యమించాలి..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మార్చి 23: భగత్ సింగ్ స్ఫూర్తితో యువత అవినీతిపై ఉద్యమించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లాలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై భగత్ సింగ్ 23 ఏళ్ల వయస్సు లో దేశం కోసం అమరుడు అయ్యారని, భగత్ సింగ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి బావి తరాలకు ఆయన ఉద్యమ స్ఫూర్తి తెలియజేయాల్సిన.. ఈ బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుందని మండిపడ్డారు.

స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ ముష్కరుల బానిసలుగా ఉన్న దేశ ద్రోహులను దేశ భక్తులగా చేపుతుందని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను దేశ ద్రోహులు గా చిత్రీకరణ చేస్తుందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పౌరసత్వ చట్టం, సీఏఏ అమలు చేస్తూ ప్రజలను మతాలవారీగా విడదీసి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ఈ మతోన్మాద ఆలోచనలు తిప్పి కొట్టాలని అన్నారు. బీజేపీ, మోడీ నిజమైన దేశభక్తులైతే భగత్ సింగ్ కి భారతరత్న ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని, ఆయన కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు సంగెం మధు, జేరిపోతుల జనార్దన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేశ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి సుధాకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు నవీన్, అనిరుద్, రంజిత్, శ్రావణ్, మమత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love