Trending Now

గడీల వారసులు కావాలా..? గరీబోళ్ల బిడ్డ కావాలా..?

కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులున్నయ్..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 25: ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు.. వందల కోట్లు ఖర్చు చేయడానికి వచ్చినోళ్లు.. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు. నాకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవు.. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. వాళ్లకు ఆస్తి కోట్ల రూపాయలు.. కానీ నా ఆస్తి మీరే.. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు.. నేను మీ కోసం కొట్లాడి వేల కేసులు పెట్టినా భయపడనోన్ని.. గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డ బండి సంజయ్ కావాల్నా గుండెమీద చేయి వేసుకుని ఓటేయండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ కేసీఆర్ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని పేర్కొన్నారు.

కరీంనగర్ బీజేపీ అభ్యర్ధిగా ఈరోజు ఉదయం బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బీజేపీ హైకమాండ్ నాకు టిక్కెట్ ఇవ్వగానే.. మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్ బిడ్డగా నామినేషన్ దాఖలు చేసిన. మోదీని మళ్లీ ప్రధానిగా చేసే అవకాశం కోసం కరీంనగర్ లోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని బండి సంజయ్ కోరారు. మీరు నన్ను గెలిపిస్తే నేను మోదీకి ఓటేస్తా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి ఓటేస్తరు.. ఎవరు కావాలో తేల్చుకోండని ప్రశ్నించారు.

నేను మీ బిడ్డను. పక్కా లోకల్. మీరు పెంచి పోషించిన బిడ్డను. మీకోసం నిరంతరం కొట్లాడుతున్న. మీ కోసం లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా మీకు అండగా నిలిచిన. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లిన. 317 జీవోకు నిరసనగా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే నా ఆఫీస్ బద్దలు కొట్టి కేసీఆర్ గుంజుకుపోయి జైళ్లో వేసినా భయపడలే.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడింది నేను. అగ్రవర్ణాల పేదల కోసం పోరాడింది నేను అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

వినోద్ కుమార్ నాన్ లోకల్.. మరి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? లోకలా? నాన్ లోకలా? చివరకు కాంగ్రెస్ క్యాడరే ఏం చెప్పాలో అర్ధం కాక కన్ ఫ్యూజన్ లో ఉంది. ఎవరిని చూసి, ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా తెలియని గందరగోళంలో ఉన్నరు. వందల కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఏనాడైనా పార్టీ జెండాలు పట్టుకుని మీ పక్షాన పోరాడారా? జనం కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలారా.. మీరు కష్టాల్లో ఉంటే మీ అభ్యర్థులు ఎన్నడైనా అండగా నిలిచి సాయం చేశారా? కష్టాల్లో ఉండి మీరు వస్తే నేను నాకు తోచినంత సాయం చేశానా? లేదా? .. ఆత్మపరిశీలన చేసుకోండన్నారు. ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) టీంలో బీజేపీకి మోదీ కెప్టెన్. ఆ టీంలో మేమంతా సభ్యులుగా వస్తున్నాం.. మరి కాంగ్రెస్ టీంకు ఎవరు కెప్టెన్ ఎవరు? కెప్టెన్ లేకుండా బరిలో దిగుతున్న టీంను పట్టించుకునేదెవరు? ఇక్కడున్న మంత్రి ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు.. మాట్లాడితే తన్నుడు.. గుద్దుడు.. వెధవ అంటూ తిట్టడం తప్ప సాధించేదేమీ లేదు అని ఆరోపించారు.

Spread the love

Related News