Trending Now

‘కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ఎవరితరం కాదు’

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని మాట్లాడటం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రగల్భాలు పలకడం ఆయన అవివేకానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, 2018 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇక్కడ ఒకే ఒక్క సీటు గెలిచింది మరిచారా అని గుర్తు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు బొక్కా బోర్లా పడ్డారని, మళ్లీ రానున్న ఎంపీ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుస్తామని మాట్లాడటం కిషన్ రెడ్డి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం కాదా..? అని సుధాకర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటే అని మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, లిక్కర్ రాణి ఎమ్మెల్సీ కవితను వదిలిపెట్టబోమని ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి హెచ్చరించిన బీజేపీ నాయకులంతా ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ తెలుసన్నారు.

రాజకీయ లబ్ది కోసం బేరసారాలతో లిక్కర్ కేసును తాత్కారం డ్చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమేనని ఆయన అన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ రహస్య మిత్రులని జగమంతా తెలుసునని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాల అమలు చేసి తీరుతామని సుధాకర్ గౌడ్ అన్నారు. హామీల గారడీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కోరుతూ ఢిల్లీలో మలిదశ ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖర్కశంగా వ్యవహరిస్తున్నదని బండి సుధాకర్ గౌడ్ అన్నారు. 21 ఏళ్ల శుభ్ కరణ్ సింగ్ పోలీసు కాల్పుల్లో మరణించడం బాధాకరమని, దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో మతతత్వ రైతు వ్యతిరేక బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

Spread the love