ప్రతిపక్షం, జూలై 16: ఎల్బీనగర్లో కొనసాగుతున్న వివాదానికి వెంటనే ముగింపు పలకాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఈశ్వరమ్మ, శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి చెందిన అంతర్గత వ్యవహారాన్ని కొందరు బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడంతోనే చిన్న సమస్య పెద్ద వివాదంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
యాదవ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. యాదవులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలోని సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఎల్బీనగర్ వివాదం వెనుక కొందరి కుట్ర ఉందని ఆరోపించిన జగ్గారెడ్డి.. ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు ప్రయత్నించిన కుట్రదారులను త్వరలోనే బయటపెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పర విమర్శలకు దూరంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

















