ప్రతిపక్షం, జూలై 06: ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. ఏళ్ల తరబడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
కొల్లాపూర్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై మంత్రి ఆకస్మికంగా ఆర్డీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఫైళ్ల వివరాలను పరిశీలిస్తూ, అవి ఎందుకు పరిష్కారం కాలేదని అధికారులను ప్రశ్నించారు. ఫైళ్లు ఎవరి వద్ద నిలిచిపోయాయి? వాటి పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై వివరణ కోరారు.
ప్రజలకు సకాలంలో సేవలు అందించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్న మంత్రి, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఫైళ్లను పెండింగ్లో ఉంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
















