Trending Now

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిగట్టుకుందని మండిపడ్డారు. పార్టీలో చేరడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరితే గులాబీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు గులాబీ పార్టీ నేతల తీరు ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ పార్టీదని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తారని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Spread the love

Latest News