ప్రతిపక్షం, ఆగస్టు 19: హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లోని రెండు ఓయో హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి వ్యభిచార కార్యకలాపాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సాయి ప్యారడైజ్ ఓయో హోటల్, వైశాయి కాటేజ్ ఓయో హోటళ్లలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరుగురు నిర్వాహకులు, ఐదుగురు విటులు ఉన్నట్లు గుర్తించారు.
తనిఖీల సందర్భంగా వ్యభిచార రొంపిలోకి నెట్టివేయబడ్డ ముగ్గురు బాధితులను పోలీసులు గుర్తించి రక్షించారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి అవసరమైన సహాయం అందించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పిటా చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓయో హోటళ్లలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హోటళ్ల నిర్వాహకులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే లేదా వాటికి సహకరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.





























