ప్రతిపక్షం, ఆగస్టు 14: బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కుట్టు యంత్రాలు అందించనున్నారు.
అర్హతలు ఇవే:
🔹 బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 వయస్సు 18 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి.
🔹 గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
🔹 ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.
🔹 వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, దివ్యాంగులు, ఇప్పటికే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
దరఖాస్తుకు కావాల్సినవి
అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫొటో, బ్యాంకు ఖాతా పాస్బుక్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 15లోగా తెలంగాణ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పథకం ద్వారా మహిళలకు కుట్టు యంత్రాలు అందడంతో ఇంటి వద్ద నుంచే కుట్టు పనులు చేసుకుంటూ ఆదాయం పొందే అవకాశం లభించనుంది. దీంతో బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.





























