ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో ఈరోజు సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
రాజధాని హైదరాబాద్లో రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, నిన్న కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే పరిస్థితి మరోసారి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.


















