ప్రతిపక్షం, జూలై 06: హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమారు 500 పేజీల ఛార్జ్షీట్ను న్యాయస్థానానికి సమర్పించారు.
అయితే అల్లు అర్జున్ మినహా మిగిలిన పలువురు నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణ సక్రమంగా సాగాలంటే నిందితులందరూ వ్యక్తిగతంగా లేదా న్యాయస్థానం అనుమతించిన విధంగా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
అన్ని ప్రక్రియలు పూర్తైన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు నిందితులందరూ హాజరుకావాలని న్యాయస్థానం సూచించింది.
















