Trending Now

దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ గెలవాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ప్రపంచస్థాయిలో భారత్​ గౌరవం మరింత పెరగాలంటే ఎన్నికల్లో బీజేపీ గెలవాలని, మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ జి. కిషన్​ రెడ్డి తెలిపారు. గత పదేండ్ల మోదీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. మెక్​ ఇన్​ ఇండియా కార్యక్రమంతో చైనా ఉత్పత్తులకు చెక్ పడిందని, ఇప్పుడు ఆ దేశం.. పాకిస్తాన్​ తో కలిసి మోదీ గెలవకుండా కుట్ర చేస్తున్నాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్​ లో పాల్గొనాలని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన బాగ్​ అంబర్​ పేట డివిజన్​ లో బస్తీ పర్యటన చేశారు. అనంతరం సీఈ కాలనీ వెల్ఫేర్​ అసోసియేషన్​ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కిషన్​ రెడ్డి మాట్లాడారు. ‘‘సుమారు14 పార్టీలతో దేశంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. నిన్న తమిళనాడులో ప్రాంతీయ పార్టీలను కలిసి మాట్లాడి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించాను. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా కష్టం వచ్చినప్పుడు నరేంద్రమోదీని సంప్రదిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీని కలిసి రష్యా – -ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఏదో రకంగా ఆపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచానికి ఒక నాయకుడిగా, దేశానికి ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఎక్కడా కూడా కనిపించని దేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉందని పాక్​, చైనా దేశాలు సహించలేకపోతున్నాయి. మేక్​ ఇన్ ఇండియాతో చైనా వెనకబడిపోయింది. ఆ కారణంగా చైనా దేశం భారత్ మీద కక్ష గట్టి వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో మోదీని ఓడించాలని కుట్రలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో మీ కాలనీలో ఎక్కువ ఓటింగ్ జరగాలి”అని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

మార్పు కనిపిస్తోంది..

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటిసారి దేశంలో మార్పు కనిపిస్తోందని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘దేశ అభివృద్ధి, దేశ గౌరవాన్ని వ్యతిరేకించే శక్తుల ఓట్లు ఎక్కువ పోలయ్యే అవకాశం లేకపోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు దేశం కోసం, అభివృద్ది కోసం, దేశ గౌరవం కోసం, ఆధ్యాత్మికం కోసం పోలింగ్ లో పాల్గొనాలి. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయం, రాష్ట్రంలో కూడా అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. పేదవారి సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. పేదవారి ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం నుంచి మొదలు చంద్రయాన్-3 వరకు అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోంది. త్రిపుల్ తలాక్ రద్దు చేసి దేశంలోని10 కోట్ల ముస్లిం మహిళలకు విముక్తి కల్పించారు. హైదరాబాద్ నుంచి 4 వందే భారత్ రైళ్లను మోదీ కల్పించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాం. కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను, నరేంద్రమోదీని ఆశీర్వదించాలని కోరుతున్న”అని అన్నారు.

400 సీట్లు లక్ష్యం..

దేశంలో లోక్ సభ ఎన్నికలకు నగారా మోగిందని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. ఈ ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలని, నరేంద్ర మోదీకి ఎంత మెజారిటీ వస్తదో నిర్దేశించే ఎన్నికలని తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీకి 302 స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 370 సీట్లు వస్తాయని అంచనా. ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు మోదీకి ఇవ్వబోతున్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మోదీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచాలంటే, పేద ప్రజలకు సంక్షేమం అందాలంటే, దేశంలో మోలిక వసతులు ఏర్పాటు చేయాలంటే మోదీ మళ్లీ రావాలని140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి నరేంద్రమోది. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి 17కు 17సీట్లు గెలిపించి, దేశంలో మూడవసారి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేయాలని కోరుతున్న”అని కిషన్​ రెడ్డి కోరారు.

Spread the love