Trending Now

కాంగ్రెస్ గెలిస్తే బతుకులు బర్బాద్ అవుతాయి : బండి సంజయ్

ప్రతిపక్షం, కరీంనగర్: నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలన్నీ ఆగిపోతాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ అవుతాయన్నారు. ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కలవడంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలిస్తే తప్పేముంది..? మోదీని పెద్దన్న అని సంబోధించడంలో తప్పేముంది? దీనిని రాజకీయం చేయడం సిగ్గు చేటు.. సీఎం సైతం భవిష్యత్తులోనే కేంద్రంతో సత్సంబధాలు కొనసాగించాలే తప్ప గొడవలు పెట్టుకుంటే నష్టపోయేది ప్రజలేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సంజయ్ కొట్టిపారేశారు.. కాంగ్రెస్, బీజేపీ ఎన్నడూ కలవదు. కాంగ్రెస్, బీజేపీ తూర్పు, పడమర వంటి పార్టీలు.. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటాయని బీఆర్ఎస్ నేతలు కారు కూతలు మానుకోవాలి అంటూ చురకలంటించారు. తెలంగాణ నుండి 17కి 17 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిపిస్తే.. కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం.. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాది.. అని ఉధ్ఘాటించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందంటూ దుయ్యబట్టారు. హామీల అమలు పేరుతో భారీ ఎత్తున కోతలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

Spread the love