- నవంబర్ 28న నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రతిపక్షం, జులై 09,వనపర్తి ప్రతినిధి: జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST)-2027 ద్వారా 2027-28 విద్యా సంవత్సరానికి వట్టెం 6వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 31, 2026 చివరి తేదీ అని పేర్కొన్నారు. అభ్యర్థులు https://navodaya.gov.in లేదా http://cbseitms.rcil.gov.in/nvs/ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నవంబర్ 28, 2026న నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. అలాగే విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ప్రవేశాలపై విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

















