Trending Now

నరేష్​తో హరీశ్​రావుకు సంబంధం లేదు..

ఆయనపై నార్సింగ్​పీఎస్​లో ఫిర్యాదు

మాజీ మంత్రి హరీశ్​రావు కార్యాలయం వెల్లడి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావుకు పీఏ గా పనిచేయలేదని, మంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేశాడని హరీశ్​రావు కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి ఆఫీసు మరుసటి రోజు 06-.12-.2023 రోజున మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగింది. ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు కార్యాలయంకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది.

దీనిపై వెంటనే మా కార్యాలయం స్పందించి, నరేష్ అనే వ్యక్తిపై 17-.12.-2023 నాడు, నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కాబట్టి, ఆ వ్యక్తితో హరీశ్ రావుకు గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మా కార్యాలయం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా, ఎన్నో విధాలుగా సహాయం పడింది. ఈ విషయం అందరికి తెలిసిందే. వాస్తవాలు గుర్తించాలని ప్రకటనలో కోరారు.

Spread the love