Trending Now

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా..

ప్రతిపక్షం, నేషనల్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రావాల్ సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.

ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న సమయంలో సమన్లు పంపడం చట్టు విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది. ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పలు కారణాలతో విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. కాగా కేజ్రీవాల్‌ను గతంలో ఐదుసార్లు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

Spread the love