ప్రతిపక్షం, జూలై 08: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద పార్టీకి సంబంధించిన రూ.440 కోట్ల డిపాజిట్లను ఈడీ ఫ్రీజ్ చేసినట్లు సమాచారం.
సైబర్ మోసాలకు సంబంధించిన నిధులు టీఎంసీ ఖాతాల్లోకి చేరాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా పార్టీ ఖాతాల లావాదేవీలను పరిశీలిస్తుండగా, ఏవియేషన్ సేవలు సహా పలు సర్వీస్ సంస్థలకు రూ.160 కోట్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నిధులు విమాన సేవల పేరిట దుర్వినియోగం అయ్యాయా? లేదా ఇతర అక్రమ లావాదేవీలకు ఉపయోగించారా? అనే కోణంలో ఈడీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

















