Trending Now

‘తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృద్ధి’

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మాటల్లో కాకుండా, చేతల్లో చూపిస్తామన్నారు. వరంగల్ కాళోజీ కళాక్షేత్రం పనుల పురోగతి, భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులపై మంగళవారం సచివాలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ గార్లు అధికారులతో సమీక్షించారు. చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణాలను చేపట్టాలని ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీస్కోవాలని అధికారులకు సూచించారు.

30 కోట్ల రూపాయలతో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇందులో 20 కోట్ల రూపాయలను SDF క్రింద, 10 కోట్ల రూపాయలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సమకూరుస్తుందని తెలిపారు. తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మిస్తున్నామని, మాడవీధుల నిర్మాణంతో పాటు ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సంధర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు కృషి చేసిన కాళోజీ నారాయణరావు కళాక్షేత్ర పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని, అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను కూడా తనిఖీ చేయాలని, జరిగిన పనులకంటే ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లకు నిధులు విడుదలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్, హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్త పట్నాయిక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love