ప్రతిపక్షం, జూలై 14: హైదరాబాద్లో మైనర్లతో వాహనాలు నడిపించడం పట్ల అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆరేళ్ల చిన్నారికి కారు స్టీరింగ్ ఇచ్చి డ్రైవింగ్ చేయించిన ఘటనపై రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. సంబంధిత కారు రిజిస్ట్రేషన్ను ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, తల్లిదండ్రులు మరియు వాహన యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించి మైనర్లకు కార్లు లేదా ద్విచక్ర వాహనాలు అప్పగిస్తే, వాహన యజమానులతో పాటు తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారుల వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో మైనర్ డ్రైవింగ్కు సంబంధించిన ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 4,070 వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం మైనర్ డ్రైవింగ్ను పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చట్టబద్ధమైన డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

















