Trending Now

తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలి

ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లక్ష్మి డిమాండ్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ కి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్య పానం నిషేధించి బెల్టు షాపులను రద్దు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే మూసివేయాలని గతంలో ఉన్న బీఆర్ఎస్ బెల్ట్ షాపులకు పర్మిషన్ లు ఇస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని అయితే గెలిచిన తర్వాత ఇప్పటివరకు రద్దు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలన్నారు. గ్రామాలలో పేదలకు త్రాగడానికి మంచి నీళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులలో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్న ప్రతి గ్రామంలో మాత్రం బెల్ట్ షాపులు ఉన్నాయని మండిపడ్డారు. ఈ బెల్ట్ షాప్ ల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయని అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదల స్థితిగతులను ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోవడంలేదని పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు జి గంగామణి, లక్ష్మి, సీహెచ్ కవిత, తశ్రీన్, విజయలక్ష్మి, సునీత, మంజుల, రాధ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News