ప్రతిపక్షం, జూన్ 04: హైదరాబాద్ నగరంలో రహదారుల మౌలిక సదుపాయాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం రెండో దశ కింద రూ.3,145 కోట్లతో గ్రేటర్ హైదరాబాద్, కంటోన్మెంట్, మహానగర ప్రాంతాల్లో మొత్తం 1,045 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక సాంకేతికతతో కొత్త రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు, గుంతల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, మన్నికైన రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడం, నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

















