Trending Now

బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. తాజా మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జి ఇతరుల ఆధ్వర్యంలో ఆయన హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.విట్టల్ రెడ్డి 2009 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి చివరికి టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ ను వీడి పీఆర్పీలోకి చేరారు. పీఆర్పీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి వేణుగోపాల చారి పై ఘోరంగా ఓటమిపాలయ్యారు.

రాజకీయ పరిణామాల కారణంగా మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 2014లో కాంగ్రెస్ ముధోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో బీఆర్ఎస్ లోకి చేరారు. 2018లో కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న విట్టల్ రెడ్డి తిరిగి గెలుపొందడంతో ఆయనకు బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ నిర్మల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి మళ్లీ టికెట్ పొందిన ఆయన బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ చేతులలో ఓటమి పాలయ్యారు. ముధోల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా కూడా వ్యవహరించారు. నిజానికి విట్టల్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ కుటుంబంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరొందింది.

Spread the love