హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 12: ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో కీలక సమావేశం నిర్వహించి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు నేషనల్ స్టాండింగ్ కమిటీ (ఎన్ఎస్సీ) అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ అధికారిక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రాధాన్యత, తెలంగాణ రైతాంగానికి కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సాగునీటి కొరతను అధిగమించడంలో సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని వివరించారు.
అధికారుల బృందంతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ఉన్న జలవనరుల అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అనుమతుల కోసం రాజకీయ, పరిపాలనా, దౌత్యపరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకం అమలైతే ఉత్తర తెలంగాణ వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు అనుమతుల సాధనలో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కొనసాగుతున్న చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక చొరవ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

















