ప్రతిపక్షం, వెబ్డెస్క్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అనేక ఉపద్రవాలు వస్తాయని, ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రజల ఏకైక లక్ష్యం కావాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం మెదక్లో ప్రజాసంఘాలతో కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతులపై కోదండరాం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు ఎన్నికల అభ్యర్థి ఎవరనేది కూడా పట్టించుకోలేని స్థితికి ప్రస్తుత లోక్సభ ఎన్నికలు చేరుకున్నాయని, బీజేపీని ఎదురిస్తున్న పార్టీకి అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రజలు ఓటేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కేసీఆర్ తలొగ్గక తప్పలేదని, రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నికల్లో బీజేపీని కూడా ఓడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసంఘాలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అమిత్షా డీప్ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించడంలో కేంద్రం అణిచివేత ధోరణి కనిపిస్తోందన్నారు.