- రోడ్డు భద్రత అనేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదు: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి
- రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల సేవనం ద్వారా జరిగే అనర్థాలను కళా ప్రదర్శన
ప్రతిపక్షం, జూన్ 10, వనపర్తి ప్రతినిధి: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలని, తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం స్థానిక కల్యాణసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు దేశంలో జరిగిన కొన్ని ఘోర రోడ్డు ప్రమాదాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు.అదేవిధంగా పోలీస్, సాంస్కృతిక శాఖ కళాకారులు రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల సేవనం ద్వారా జరిగే అనర్థాలను కళా ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి డ్రైవరు నేను చాలా బాగా నడిపిస్తాను అనే ధీమాతోనే ఉంటారని కానీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నిర్లక్ష్యానికి మూల్యం ఎంతటిదో తెలుస్తుందన్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు రోడ్డు ప్రమాదం ద్వారా ఒకరి ప్రాణం పోతుందని తెలియజేశారు. అందుకే వనపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణ కొరకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ పెట్టుకోవడం, నాలుగు చక్రాల వాహనం నడిపేవారు సీటు బెల్టు వేసుకోవడం, స్పీడ్ లిమిట్ పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడిపించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపించకపోవడం వంటి కనీస నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఉపేక్షించేది లేదని, జరిమానాలు భారీగా వేయడం జరుగుతుందని తెలియజేశారు.
- వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదు: ఎస్పీ సునీత రెడ్డి
జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ పోలీసులు రోడ్డు పై తనిఖీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపోహ పడతారని, కానీ రోడ్డు భద్రత అనేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదనీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగి ప్రతి రోజు దేశంలో కనీసం 15 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి, 2026 నుండి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల సమన్వయంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ ప్రాణం తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడేవిధంగా వాహనం నడిపించాలని సూచించారు. ఇప్పుడే వస్తాను అని చెప్పి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోతే ఆ కుటుంబంలో ఎలాంటి విషాద ఛాయలు అలుముకుంటాయో అది అనుభవించే వారికి తెలుస్తుందన్నారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నడిపించాలని సూచించారు. అతివేగం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపటం, మొబైల్ మాట్లాడుతూ, ఇద్దరు కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టుకొని వాహనం నడపటం, వంటి పనులు చేయవద్దని, హెల్మెంట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు నిబంధనలు పాటిస్తూ, పాదచారులను, ఇతర వాహనాలను దృష్టిలో పెట్టుకొని వాహనం నడపాలని సూచించారు.అనంతరం రోడ్డు భద్రతపై కళా ప్రదర్శన నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు, పోలీస్ కళాకారులకు హెల్మెంట్ ప్రధానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, డి.ఎస్.పి గిరిధర్, బసంతి ఫౌండేషన్ నిర్వాహకులు అజయ్ నాయుడు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు, సి.ఐ లు, ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


















