Trending Now

మోడీతో కొట్లాడే ధైర్యం ఆయనికి లేదు..

ప్రాంతీయ శక్తులే మోడీతో బలంగా కొట్లాడగలవు

మల్కాజ్ గిరిలో యూత్ మీటింగ్‌లో మాజీ మంత్రి కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మోడీతో కొట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు. ప్రాంతీయ శక్తులే బలంగా మోడీతో కొట్లాడగలవు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్, మల్కాజ్ గిరిలో యూత్ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు కదా? బీఆర్ఎస్ ఎందుకు ఉండాలే అని కొందరు అంటున్నారు. 2001 లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పార్లమెంట్ లో మనకు బలం ఉండాలే అన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు అవహేళన చేసే విధంగా మాట్లాడారని.. 2004 లో మనం ఐదుగురు ఎంపీలు గెలిచినాం. ఆ ఐదుగురితోనే కేసీఆర్ ఢిల్లీకి పోయిండు. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణను సాధించింది కేసీఆర్ మాత్రమే అని గుర్తుచేశారు.

కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ, మోడీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారు. రాహుల్ గాంధీని, మోడీని ఎదురించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. స్కై వే కట్టటం కోసం పదేళ్లు మిలిటరీ భూములు ఇవ్వమంటే కంటోన్మెంట్ లో ఇయ్యలే. కేంద్రపాలిత ప్రాంతం అయితే మన జుట్టు తీసుకొనిపోయి ఢిల్లీ వాడి చేతిలో పెట్టినట్లయితదన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఈ కుట్రను అడ్డుకోవాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉండాలని తెలిపారు.

ఢిల్లీలో ఉన్నది బీజేపీ ది సవతి తల్లి లాంటి వ్యవహారం. వాళ్లు మనకు అడగనిదే ఏదీ చేయరు. గల్లా పట్టి నిలదీసే ధైర్యం ఉండాలంటే మన కేసీఆర్ సైనికులు పార్లమెంట్ లో ఉండాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తోంది బీజేపీ. అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపోళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలకగా పడగొట్టారు. కానీ కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, స్టాలిన్, కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి విఫలమైంది. గట్టి లీడర్లు ఉన్న చోట బీజేపీ ఆటలు సాగలేదు. కాంగ్రెస్ కు మాత్రం బీజేపీని అడ్డుకోవటం చేతకాలేదు. మోడీతో కొట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు. ప్రాంతీయ శక్తులే బలంగా మోడీతో కొట్లాడగలవని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు జనరేటర్లు, ఇన్వెర్టర్లు, క్యాండిల్ లైట్లు, టార్చిలైట్, పవర్ బ్యాంక్, ఛార్జింగ్ బల్బ్ లు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వస్తే ఈ పరిస్థితి ఉంటది ముందే చెప్పినం. మీరు కాంగ్రెస్ హామీలను నమ్మలేదు. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో ప్రజలు ఆ పార్టీ నమ్మారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మీరు 10-12 సీట్లు ఇవ్వండి. 6 నెలల్లోనే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. అరచేతిలో వైకుంఠం చూపించిండు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ. 2500, పెద్ద మనుషులకు 4 వేలు అని చెప్పిండు. చెప్పిదాంట్లో ఒక్కటైనా ఈ రేవంత్ రెడ్డి అమలు చేసిండా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

5 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటంటే చిల్లర మాటలు, ఉద్దెర పనులు.. లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అంటాడు. లంకెబిందెల కోసం దొంగలు కదా వెతికేది? పేగులు మెడలు వేసుకుంట అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుంటా అంటాడు. సీఎం చేసే పనులేనా? మన తెలంగాణ పరిస్థితి పిచ్చోని చేతిలో రాయిలా తయారైందన్నారు. కరెంట్, నీళ్లు ఇచ్చుడు చేతనైతలేదు. కానీ విలన్లు చెప్పినట్టు డైలాగులు చెబుతుండు. హైదరాబాద్ లో ఉన్న కంపెనీలను కాపాడుకునే చేతనైతలే. ఇంకా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితే లేదు. పరిపాలన చేతకాని వాళ్లకు అవకాశం ఇస్తే నష్టపోయేది మనమే. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి హైదరాబాద్ ఒక్క పనిచేసిన అని చెప్పగలడా? ఒక్క బడి కట్టలే, గుడి కట్టలే. ఎందుకు ఓటు వేయాలంటే జై శ్రీరామ్ అంటాడు. 2014 లో ఏమన్నాడు. ఇంటింటికి రూ. 15 లక్షలు అన్నాడు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పిండు. బుల్లెట్ రైళ్లు, ఇండియాను 5 టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని కూడా అన్నాడు. ఒక్కటైనా అయ్యిందా? ఈ ప్రధాని మోడీ ధరలు కూడా తగ్గిస్తా అన్నాడు. కానీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిండు. పెట్రోల్ ధరలు, డిజీల్ ధరలు పెంచటం కారణంగా ఈ ధరలన్నీపెరిగాయి.

మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది. పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడన్నారు. మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది అబద్దమని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారత దేశంలో ఏం జరుగుతుందో మీ యువత తెలుసుకోవాలె. ఇండియాకు ఏదో జరుగుతుందని.. హిందూమతమని, పాకిస్తాన్ అంటూ విద్వేషాలు పెంచి రాజకీయాలు చేయటమే బీజేపీ పని.

పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే, విభజన హామీలు ఒక్కటి కూడా చేయలే, ఎందుకు మనం బీజేపీకి ఓటు వేయాలో ఆలోచించాలె. అడిగితే గుడి కట్టినం అంటారు. గుడిని మనం కూడా కట్టినం. కేసీఆర్ గారు యాదాద్రిని కట్టలేదా? కానీ మతం పేరుతో ఎప్పుడైనా రాజకీయాలు చేశారా? రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పాడు. పరిపాలకుడు ఎవరినైనా ఒకే విధంగా చూడాలి. కానీ హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయ్ ఇయ్యాడు మోడీ. అదే గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇస్తాడు. ఇదేనా రాజధర్మం? అని కేటీఆర్ ప్రశ్నించారు. దయచేసి లాంగ్ వీకెండ్ ఉందని యువత ఓటు వేయకుండా ఉండొద్దు. మీరు ఓటు వేయకపోతే మీకు ఇష్టం లేని లంగ, దొంగ నాయకులు రాజ్యమేలుతారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్. రాగిడి లక్ష్మారెడ్డి గారు మాత్రం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

Spread the love

Related News