ప్రతిపక్షం, జూన్ 11: సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై సినీనటి హేమ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తనపై అసత్య ప్రచారం, అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని గతంలోనే హెచ్చరించినప్పటికీ కొందరు వ్యక్తులు అదే తీరును కొనసాగించారని హేమ పేర్కొన్నారు. పలుమార్లు సహనం పాటించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో న్యాయపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందన్నారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖాతాలకు సంబంధించిన ఆధారాలు, చిత్రాలను సేకరించి పోలీసు అధికారికి అందజేశానని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు అవసరమని పేర్కొన్న హేమ, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.














