ప్రతిపక్షం, జూన్ 20: తెలంగాణ రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చేపట్టనున్న పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని ఆయన తన ప్రజా కార్యక్రమాలు, రాజకీయ శైలిలో మార్పులు తీసుకురానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో కొత్త రూపం, కొత్త దుస్తుల శైలి, ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సభలు, సమావేశాల్లో ప్రసంగించే విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందం సహకరిస్తోందని సమాచారం.
అదేవిధంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యాలయం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో మరింత బలమైన మద్దతు సంపాదించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

















