Trending Now

రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు..?

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని పూర్వవైభవాన్ని తీసుకవచ్చేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసినా, ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ ముఖ్యంగా టీడీపీ పార్టీపై దృష్టిపెట్టి ఆ పార్టీ నుంచి గెలుపొందిన ముగ్గురిని బీఆర్​ఎస్​లో చేర్చుకుంది. ఇక మిగిలింది మాత్రం ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి, ఆర్​. కృష్ణయ్య మాత్రమే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో రేవంత్​రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరగా, ఆర్​. కృష్ణయ్య మాత్రం టీడీపీ సభ్యుడిగా చివరి వరకు కొనసాగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్​ఎస్​పార్టీని ఓ డించాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్​ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కాసానితో పాటు పలువురు రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరారు.

ఖమ్మం నుంచి పోటీ..

తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు లోక్​సభ ఎన్నికలను అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో జట్టుకట్టి ఎన్నికల సమరంలో దిగుతున్న చంద్రబాబు, తెలంగాణలోనూ బీజేపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెలువరించారు. ఇందులో భాగంగా ఖమ్మం సీటు తమకు కేటాయించాలని ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. ఖమ్మంలో తమకు మంచి క్యాడర్‌ ఉందని చెప్పిన చంద్రబాబు.. కులసమీకరణ పరంగా చూసుకున్నా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఆ సీటును ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. చంద్రబాబు ప్రతిపాదనను ఢిల్లీ పెద్ద లు కూడా సీరియస్‌గా తీసుకుని లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. ఖమ్మంలో టీడీపీకి టికెట్‌ ఇస్తే, గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆ ప్రభావం కనిపిస్తుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నట్లు సమాచారం.

Spread the love