ప్రతిపక్షం, జూన్ 04: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా జూన్ 4న దేశంలోకి ప్రవేశించాయి.
రుతుపవనాల రాకతో దేశంలో నాలుగు నెలల వర్షాకాలం అధికారికంగా ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి కీలకమైన ఈ వర్షాలు వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి ఖరీఫ్ పంటల సాగుకు ఊతమివ్వనున్నాయి.
మంచి వర్షాలు కురిస్తే జలాశయాలు నిండటంతో పాటు రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరనుంది. రాబోయే రోజుల్లో రుతుపవనాలు దక్షిణ, మధ్య భారత రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

















