Trending Now

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 420ని నిలబెట్టింది.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక 420ని బరిలో నిలబెట్టిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే శంకర్ స్థానిక మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక విద్యావేత్తను పారిశ్రామికవేత్త అయిన మన్నే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో రంగంలోకి దించిందని.. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని, ప్రజా ప్రభుత్వం నడుస్తుందని పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్లను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని వారికి ఎలాంటి హక్కులు, నిధులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎంపీటీసీ తదితర స్థానిక ప్రజాప్రతినిధుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేవారు కరువై ఒక 420ని రంగంలోకి దింపారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో అధికార మదంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా దుర్మార్గంగా జరిపారని గుర్తు చేశారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, సీనియర్ నేత చందు, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రఘు, బాలరాజ్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, జమ్రుద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love