Trending Now

‘సీఎం వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది’.. మాజీ మంత్రి హితవు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్​రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవుపలికారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయన్నారు. గతంలో ముంబైకి బస్సులు వేయాలని ధర్నాలు చేసేవారని.. తమ పదేళ్ళలో ముంబైకి బస్‌లు కావాలని ధర్నా చేయలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుందన్నారు. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డురమన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ పథకంతో నీళ్లు ఇవ్వలేదా ఆత్మసాక్షిగా చెప్పండి అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నారు గనుకే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ వాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు శిలా ఫలకాలు వేశారన్నారు. తెలంగాణ వచ్చినందుకే రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు. జిల్లా నుంచి సీఎం అయినందుకు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

పాలమూరు ప్రాజెక్టును పరిశీలించాలి..

కాళేశ్వరం పరిశీలించిన మీరు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని గౌడ్​ అన్నారు. కొడంగల్ ఎత్తి పోతలపై పునరాలోచించన చేయాలని సూచించారు. జూరాల నుంచి నీటి తరలింపు సాధ్యమేనా ఆలోచించాలన్నారు. కర్ణాటక కొత్త ఎత్తి పోతల పథకాలను ప్రారంభిస్తే జూరాలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు. 15 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పాలమూరు ప్రాజెక్టును నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులతో ఒకసారి సమీక్షించుకోవాలన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటి అన్నదానిపై పునరాలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముసళ్ళ పండగే అని హెచ్చరించారు. ‘‘మేము ఎంతో చేసినా.. ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకున్నారు. అందుకే మీకు అవకాశం వచ్చింది. బీజేపీతో పొత్తు ఉంటే రాష్ట్ర నేతలతో ఉంటుందా? మేము కూడా వాళ్లలా చెప్పుతో కొడతాం అనవచ్చు. రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరం. పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పోటీ చేయలేదా. మాకు పొత్తు అవసరం లేదు’’ అని శ్రీనివాస్‌ గౌడ్ స్పష్టం చేశారు.

Spread the love

Latest News