ప్రతిపక్షం, జూన్ 15: తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్య లోపాయికారీ రాజకీయ ఒప్పందం ఉందని ఆరోపించిన మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ చరిత్రపై మాట్లాడే అర్హత పవన్కు లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.
తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని, రాష్ట్ర ఆవిర్భావంపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన పవన్ కళ్యాణ్కు సూచించారు.

















