Trending Now

సీడబ్లూసీ సమావేశంలో బీజేపీపై ఖర్గే ఫైర్..

న్యూఢిల్లీ, ప్రతిపక్షం ప్రతినిధి : గత పదే ళ్ల నరేంద్ర మోడీ పాలనలో విసిగిపోయిన దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రస్తుత ఎన్​డీఏ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలు 2004లో ఇండియా షైనింగ్‌ నినాదం మాదిరిగానే మిగలనున్నాయని విమర్శించారు. సార్వత్రిక సమరానికి సంబంధించిన ఎన్నికల ప్రణాళిక ఆమోదించేందుకు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. పదేళ్ల నరేంద్రమోడీ ప్రభుత్వంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు చితికిపోయారని ఆరోపించారు.

బడా వ్యాపారులకు మేలు చేస్తున్న బీజేపీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నులు వేస్తూ నడ్డి విరిచిందన్నారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో యావత్​ దేశ ప్రజలు మార్పుకు ఓటు వేస్తారని ఆయన అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు ఖర్గే సూచించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే భారత్‌ జోడో యాత్ర, న్యాయ్‌ యాత్ర ద్వారా ప్రజల నిజమైన సమస్యలను రాహుల్‌ గాంధీ దేశం దృష్టికి తెచ్చారని కొనియాడారు.

Spread the love