Trending Now

తెలంగాణాపై బీజేపీ ఫోకస్​..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతాపార్టీ నాయకత్వం ఫోకస్​ పెంచింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగా భారీగా ఫోకస్​ పెట్టిన బీజేపీ ఎందుకో ఏమోగాని చివర్లో ఫోకస్​ తగ్గించింది. దీంతో ఆ ఎన్నికల్లో అశించిన మేరకు ఫలితాలు రాలేదన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించింది. అయితే లోక్​సభ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫోకస్​ పెట్టడంతో రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు లోక్​సభ స్థానాలను కైవసం చేసుకోవాలన్నా ఆలోచనతో రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ ఆగ్రనాయకుడు అమిత్​షాలు విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది.

ఇందుకోసం షెడ్యూల్ కూడా రెడీ అవుతోంది. రేపు బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సమావేశం కానున్న అమిత్ షా.. పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి బూత్ లో ఓటర్లను సమీకరించేందుకు.. ఇతర రాష్ట్రాల్లో అవలంభించిన విధానం గురించి హోంమంత్రి నేతలకు సూచించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు హోంమంత్రి తెలియజేస్తారు. ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.

ప్రధాని పర్యటన..!

ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని పర్యటించి ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ నెల 16, 18, 19 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజ్‌గిరిలో మోదీ సభలకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో మోదీ సభలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు 17న చిలకలూరిపేట ఎన్డీయే సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love