ప్రతిపక్షం, జూలై 19: సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని కర్ణాటకకు చెందిన వైష్ణవి దాస్ నిరూపించారు. నీట్ రీటెస్ట్–2026లో 720 మార్కులకు 700 మార్కులు సాధించి ఆల్ ఇండియా 20వ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు.
తన విజయ రహస్యాన్ని వెల్లడిస్తూ వైష్ణవి దాస్ మాట్లాడుతూ.. 11వ తరగతిలో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేశానని తెలిపారు. దాంతో సమయం వృథా కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పారు.
రోజుకు ఇన్ని గంటలు చదవాలనే కఠినమైన ప్రణాళికను కాకుండా, వారానికి ఒకసారి చదువుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకునేదానినని వైష్ణవి తెలిపారు. మాక్ టెస్టులు రాయడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాలను పదేపదే పునశ్చరణ చేయడం తనకు ఎంతో ఉపయోగపడిందన్నారు.
పరీక్షల సమయంలో సానుకూల ఆలోచనా విధానం చాలా ముఖ్యమని, ఒత్తిడికి గురికాకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించడం, క్రమం తప్పకుండా మాక్ టెస్టులు రాయడం, పునశ్చరణ చేయడం తన విజయానికి ప్రధాన కారణాలని వైష్ణవి దాస్ వెల్లడించారు.
















