ప్రతిపక్షం, ఆగస్టు 06: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పంపిన లీగల్ నోటీసులపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కర్ణాటకలో హరీశ్ రావు ఎందుకు పూజలు నిర్వహించారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హరీశ్ రావు వెళ్లిన ఆలయాలు క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందినవని ప్రచారం ఉందని, ఆ విషయంపై ఆయనే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మూఢనమ్మకాలతో ఎలాంటి సంబంధం లేదని, తాము అలాంటి వాటిని విశ్వసించబోమని స్పష్టం చేశారు.
తాను హరీశ్ రావును వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో, ఎవరు నష్టం కలిగించారో ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, తనపై చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ హరీశ్ రావు ఇటీవల మహేశ్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

















