[t4b-ticker]

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు యధాతదం

కోర్టులో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపిస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 22: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహకారం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఈ పథకాలను ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపిస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల కోర్టు స్టే విధించిందని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వం కౌంటర్‌తో పాటు వెకేట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ అంశంపై కోర్టులో హియరింగ్ కూడా పూర్తయిందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగం

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలసీలో భాగమని, పేద ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని అనుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు.

ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల వైఖరి సరికాదు

పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించే పథకం విషయంలో కూడా రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంక్షేమ పథకం ఆగిపోతే బాగుంటుందని భావిస్తూ, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని ప్రతిపక్షాలు శునకానందం పొందడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

పేద ప్రజలకు ఉపయోగపడే పథకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రతిపక్షాలు కూడా న్యాయస్థానంలో ఇంప్లీడ్ అయి పేద ప్రజల ప్రయోజనాల కోసం తమ వాదనలు వినిపించాలని మంత్రి సూచించారు.

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

పేద కుటుంబాలకు అండగా నిలవడం, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకుంటూనే ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు నిరంతరం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News